ఐపీఎం, ఫుడ్ సేఫ్టీ విభాగం ల్యాబ్స్ పని తీరు, సాధించిన పురోగతిపై వెంగళ్ రావు నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని, అలాగేఫుడ్ సేఫ్టీ విషయంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలి, అగ్రస్థానం చేరాలని మంత్రి ఆకాంక్షించారు. అధికారులు లేని చోట జిల్లా వైద్యాధికారులే ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు నిర్వహించాలని, ఈ మేరకు వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో భర్తీలు చేపడతామని తెలిపారు. ఉత్తమ విధానాలు అనుసరించి, మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాలు అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
ఇక నెలలో రెండు శనివారాల్లో లైసెన్సింగ్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి. ఒక వైపు కల్తీ చేసే వారిపై చర్యలు తీసుకుంటూనే, మరోవైపు ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది, కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుంది. కల్తీ ఆహారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కల్తీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుంది” అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
మరోవైపు ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించి, ఎక్కడైనా కల్తీ జరిగినట్లు, నాణ్యత లేనట్లు సమాచారం ఉంటే 040-21111111 నెంబర్ కి కాల్ చేసి లేదా, @AFCGHMC ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని మంత్రి తెలిపారు. ఫిర్యాదులు అందగానే అధికారులు వెళ్లి పరిశీలించి, చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వం ఆహార కల్తీని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఈ అంశంపై కోర్టు కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలి, త్వరగా పరిష్కారం అయ్యేలా చొరవ చూపి కల్తీ చేసే వారి ఆట కట్టించాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి ఎక్కువగా నష్టం కల్గించే కల్తీ లపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని మొబైల్ వాహనాలు పని చేయాలని, టాస్క్ ఫోర్స్ బృందాలు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, ఐపిఎం, ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివ లీల, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY