హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నాబార్డ్ ఆధ్వర్యంలో జరిగిన స్టేట్ క్రెడిట్ సెమినార్ కు ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సదస్సులో ఎస్ఎల్బీసీ కన్వీనర్ మయా, ఆంధ్రా బ్యాంక్ ఈడీ కుల్భూషణ్, నాబార్డు సీజీఎం విజయ్కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ 2020-21ని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రమని చెప్పారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టే, రైతుల సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నారని తెలిపారు. అలాగే వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. వ్యవసాయ రంగంలో పలు రాయితీలు కల్పిస్తూ, బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి 30 శాతం ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. ఇరిగేషన్ కోసం నేరుగా ప్రభుత్వం బడ్జెట్ నుంచి 9 వేల కోట్లు, బ్యాంకుల నుంచి 25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పశుసంవర్థక శాఖ ద్వారా వ్యవసాయ ఆధారిత రంగాలైన డైరీ, ఫిషరీష్, పౌల్ట్రీ, గోర్రెల పెంపకం కోసం ప్రతీ ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
“రైతు బంధు పథకం కింద 12 వేల కోట్ల రూపాయలను రైతులకు ఏటా ఖర్చు చేస్తున్నాం. రైతును బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు నాబార్డ్, గ్రామీణ బ్యాంకులు, ఇతర వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ఇప్పుడు వ్యవసాయ ఆధారిత రంగాలను బలోపేతం చేయాల్సి ఉంది. ఈ రంగాలను బలోపేతం చేసేందుకు రుణాలు కూడా నాబార్డ్ రుణాలివ్వాలి. నాబార్డ్, రూరల్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు వ్యవసాయశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలతో సమన్వయంతో పని చేయాలి. నాబార్డ్ నిధుల వినియోగంలోను తెలంగాణ దేశంలోనే బెస్ట్. ఈ ఏడాది నాబార్డ్ హైటెక్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. నాబార్డ్ ప్రణాళిక సమావేశాలను జిల్లాల్లో రైతుల మధ్య నిర్వర్తించి వారి అభిప్రాయాలను కూడా సేకరించాలని” మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
[subscribe]