తెలంగాణ రాష్ట్రంలో 9 కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి 22న పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. మున్సిపాలిటీల్లో 74.73 శాతం పోలింగ్ నమోదు కాగా, కార్పోరేషన్లలలో 58.86 శాతం పోలింగ్ జరిగింది. ఇక ఓట్ల లెక్కింపు పక్రియను జనవరి 25న చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మేయర్లు, ఛైర్ పర్సన్ల ఎంపికకు సంబంధించి గురువారం నాడు నోటిఫికేషన్ జారీ అయింది. కొత్తగా ఎన్నికయ్యే పాలక మండళ్ల మొదటి సమావేశం జనవరి 27న నిర్వహించనున్నారు. ఈ సమావేశాలలోనే కార్పోరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కూడా చేపట్టనున్నారు.
ముందుగా పాలక మండలి సమావేశంలో కొత్తగా ఎన్నికయిన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటల నుంచి మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. అనంతరం డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక పక్రియ నిర్వహించనున్నారు. మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నికకు సంబందించిన నోటీసును జనవరి 25న అధికారులు జారీ చేయనున్నారు. మరోవైపు కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో జనవరి 24న పోలింగ్ జరగనుండగా, అక్కడ ఓట్ల లెక్కింపు పక్రియను జనవరి 27న చేపడతారు.
[subscribe]