భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్- ఒకప్పటి టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ భవన్లో పార్టీ ప్రతినిధుల సమావేశం (జనరల్ బాడీ మీటింగ్) జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షత వహించగా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సహా ఇతర రాష్ట్ర మంత్రులు సహా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ రిజిస్టర్లో మొదటిగా సంతకం చేశారు.
ఇక ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఆయన దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలని ఆకాంక్షిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ, నేటికీ ప్రజలు కనీస అవసరాలైన త్రాగునీరు, సాగునీరు, విద్యుత్ వంటివి పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించాల్సిన యువత సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక తల్లడిల్లుతున్నారని, అలాగే కుల, మత, లింగ వివక్ష వంటి అసమానతలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమానంగా జీవించే హక్కులు, రక్షణ కల్పించినప్పటికీ.. దేశంలో దళిత, మైనార్టీలపై దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నదులలో 70 వేల టీఎంసీల నీరు ప్రవహిస్తుండగా.. అందులో కేవలం 20 వేల టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామని అన్నారు. తెలంగాణ మినహా దేశంలోని అన్నిప్రాంతాల్లో ప్రజలు త్రాగునీరు, సాగునీరు లేక అవస్థలు పడుతున్నారని, దూరదృష్టి, సమర్ధవంతమైన పాలన అందించినప్పుడే వీటిని అధిగమించగలమని పేర్కొన్న మంత్రి కేటీఆర్.. ఈ దిశగా దేశంలో బీఆర్ఎస్ పార్టీ కృషి చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
కాగా ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. నేడు జరిగే ప్రతినిధుల సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుంది. దీనికితోడు ఈనెల 30న కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డా. బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయం, అలాగే జూన్ 1న అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీటి ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో నేటి సమావేశంలో పలు కీలక రాజకీయ తీర్మానాలు, పార్టీ పరమైన తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఇక ఇటీవలే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ జరిగిన క్రమంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE