తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100కి పైగా సీట్లు సాధిస్తామని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ మేరకు ఆయన గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్లీనరీకి హాజరైన ప్రతినిధులనుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లు సాధించామని, ఇక రెండోదఫాలో 88 సీట్లు కైవసం చేసుకున్నామని గుర్తుచేశారు. ఇదే క్రమంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100కి పైగా సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించాలని, నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరేసి నేతల చొప్పున బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో పల్లెనిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలని, మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనే లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని నాయకులను కోరారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిరంతరం ప్రజల్లో ఉండేలా చూసుకోవడం వంటి కార్యక్రమాల ద్వారా తప్పక విజయం సాధిస్తామని పార్టీ నేతలకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశమే ఆశ్చర్యపోతోందని, ఇక్కడి ప్రగతిని చూసేందుకు పొరుగు రాష్ట్రాల ప్రజలు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రతీ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని, రాష్ట్రంలో రోడ్లు, కరెంటు, వ్యవసాయం, ధాన్యం కొనుగోళ్లు, పశుసంపద, మత్స్య సంపద వంటివాటిలో గణనీయ పురోగతి సాధించామని వెల్లడించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి టీవీ యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ వంటివి కూడా మన పార్టీ భవిష్యత్తులో చేపట్టొచ్చని, అలాగే అంతగా అవసరం అయితే పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక టీవీ ఛానల్ను కూడా నడిపే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE