భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ నేడు శాసన సభలో ఆమోదించిన టీఎస్ బీ- పాస్ బిల్లు దేశంలోనే అత్యంత విప్లవాత్మకమైనదని, ఈ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు ముందు ముందు అమలు చేసేందుకై ప్రయత్నిస్తాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటి రామారావు అన్నారు. భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన బిల్లును నేడు శాసన సభలో మంత్రి కేటిఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా జరిగిన చర్చలో మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, టిఎస్ బీ-పాస్ తో 95 శాతం పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ విధానంలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లేదంటే 22 వ రోజు డీమ్డ్ అప్రూవల్ గా ఇచ్చినట్టు భావించాల్సి ఉంటుందన్నారు. ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే పది రోజుల్లోనే దరఖాస్తును తిరస్కరించడం జరుగుతుందని అన్నారు. 75 గజాల లోపు స్థలాల్లో నిర్మాణాలకు ఏవిధమైన అనుమతులు అవసరం లేదని, నిబంధనలమేరకు ఉన్న ఈ నిర్మాణాలను దరఖాస్తు చేసుకోగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
టిఎస్ బీ-పాస్ తో మరింత పారదర్శకత:
టిఎస్ బీ- పాస్ తో భవన నిర్మాణ అనుమతుల్లో వంద శాతం పారదర్శకత ఏర్పడుతుందని, దీనితో 95 శాతం పట్టణ పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీల పరిధిల్లో 75 నుంచి 600 గజాల వరకు స్థలం ఉన్న వారు ఆన్ లైన్ లోనే ఇన్స్టంట్ పర్మిషన్ తీసుకోవచ్చని. 600 గజాల పైన స్థలం ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. 21 రోజుల్లో పర్మిషన్ రాకపోతే 22వ రోజు డీమ్డ్ అఫ్రూవల్ జారీ చేసినట్టుగా భావించవచ్చని, 22 రోజునే సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారి, మున్సిపల్ కమీషనర్ లు సంయుక్తంగా సంతకం చేసిన అనుమతి సర్టీఫికేట్ జారీ చేస్తారని పేర్కొన్నారు. దీంతో రుణాలను బ్యాంకుల నుండి పొంద వచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఈ అనుమతి సర్టిఫికెట్ తో భవన నిర్మాణ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా 15 రోజుల్లోనే ఇస్తామన్నారు.
జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షణ:
ఈ బిల్లు అమలు పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జోనల్ కమీషనర్ల ఆధ్వర్యంలోనూ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ పరిపాలన శాఖ సంచాలకులు, జీహెఛ్ఎంసీ స్థాయిలో కమీషనర్ లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని, ఏవైనా ప్రతిబందకాలుంటే పరిష్కార మార్గాలు సూచిస్తారని కేటిఆర్ తెలిపారు. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువుల్లో అక్రమ నిర్మాణాలు ఉంటే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తామని మంత్రి స్పష్టం చేశారు. చట్టం పట్ల ప్రజలకు భయం, గౌరవం ఉండాలి. అన్ని పట్టణాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తున్నామని మంత్రి కేటిఆర్ తెలిపారు.
21 రోజుల్లోనే అనుమతుల జారీ:
టిఎస్-ఐ పాస్ మాదిరి ఈ విధానానికి కాల పరిమితి నిర్ణయించామన్నారు. ఈ విధానంలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లేదంటే 22 వ రోజు డీమ్డ్ అప్రూవల్ గా ఇచ్చినట్టు భావించాల్సి ఉంటుందని అన్నారు. గతంలో వారి దయ, మా ప్రాప్తం అనే విధంగా భవన నిర్మాణ అనుమతుల జారీ ఉండేదని, ఇకనుండి ఇలా ఉండదని స్పష్టంచేశారు. నిర్మాణ అనుమతుల జారీ పత్రాల్లోనే ఆయా అనుమతులకు సంబంధించి జియో కోఆర్డినేట్ లు, జియో టాగింగ్ లను పేర్కొనడం జరుగుతుందని ప్రకటించారు.
చట్టాలంటే భయం లేకపోవడంతోనే ఇబ్బడి ముబ్బడిగా అక్రమ కట్టడాలు:
ప్రభుత్వం, చట్టం అంటే భయం లేకపోవడం వల్లే నగరాలు, పట్టణాలలో అక్రమ కట్టడాలు ఇబ్బడి, ముబ్బడిగా వస్తున్నాయని, ఇక నుండి ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలలో జరిగే అక్రమ నిర్మాణాలను ఏ విధమైన నోటీసులు లేకుండానే కూల్చివేస్తామని మంత్రి కేటిఆర్ స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని ఏంతో అధ్యయనం చేసి, పలు రకాలుగా ఆలోచించి రూపొందించామని తెలిపారు. నేడు తెలంగాణా అమలు చేసినదాన్నే రేపు దేశం ఆచరించనుందనే పద్దతిలో పార దర్శకంగా ముందుకుసాగుతున్నామని అన్నారు. నిర్మాణ అనుమతుల్లో ఏవైనా కేంద్ర ప్రభుత్వ శాఖల అనుమతుల కావాల్సి ఉంటే, తాను ఆయా కేంద్ర మంత్రులతో స్వయంగా మాట్లాడుతానని చెప్పారు.
పన్ను బకాయిల చెల్లింపు పథకం మరో నెలన్నర పొడగింపు:
రాష్ట్రంలో ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీ లో 90 శాతం మాఫీ పథకాన్ని మరో 45 రోజులపాటు పొడగిస్తున్నట్టు మంత్రి కేటిఆర్ ప్రకటించారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఈ మాఫీని అక్టోబర్ 31 వ తేదీ వరకు పొడగిస్తున్నామని అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu