పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ లపై ధరల పెంపును నిరసిస్తూ, సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలునిచ్చిన నేపథ్యంలో.. ఈరోజు సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. దేశ ప్రజల కోసం మోదీ ప్రభుత్వం ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదని, నిత్యావసరాల ధరలు మాత్రం ఇబ్బడి, ముబ్బడిగా పెంచుతోందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచారని, ఈ అధిక భారాన్ని సామాన్య ప్రజలు మోయలేరని తెలిపారు. ఒకవైపు దేశప్రజలు కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి సమయంలో ఇలా ధరలు పెంచడం అన్యాయమని అన్నారు. కేంద్ర ధోరణి ఇలాగే ఉంటే ప్రజలు కూడా బీజేపీని ఇంటికి పంపించటానికి సిద్ధంగా ఉంటారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత మోదీ సర్కార్కే దక్కిందని, దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని నిలదీశారు. సంజయ్ తెలంగాణ ఆడబిడ్డల అందరి తరఫున ఢిల్లీ వెళ్లి కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. 2014లో పెట్రోల్ ధర రూ.60 ఉండేదని.. ఇప్పుడు అది డబల్ అయిందని విమర్శించారు. ఆయిల్ పై సబ్సిడీలు ఎత్తివేయటం ద్వారా రూ.23 లక్షల కోట్లు మిగిలాయని, డ్వాక్రా మహిళలు, రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ