తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 వ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 6 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామంలోని పెంటాని చెరువులో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి లతో కలిసి చేప పిల్లలను విడుదల చేసి కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించనున్నారు. మొదటగా 5 వ తేదీన చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. కానీ 5 వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఉన్న కారణంగా 6 వ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం మడిగట్ల గ్రామంలోని మడికాని చెరువు, కోడూర్ గ్రామంలోని మైసమ్మ చెరువులో జిల్లాకు చెందిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి చేప పిల్లలను విడుదల చేయనున్నారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కమ్మదనం గ్రామంలోని వెంకాయకుంటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ లతో కలిసి చేప పిల్లలను విడుదల చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల రిజర్వాయర్ లు, చెరువులలో 50 కోట్ల రూపాయల ఖర్చుతో 81 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా 10 కోట్ల రూపాయల ఖర్చుతో 5 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరుగుతుందన్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమాలలో పాల్గొనాలని కోరుతూ ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలోని మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ లకు వ్యక్తిగతంగా లేఖలు కూడా పంపారు. చేప పిల్లల విడుదల కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీ సభ్యులు పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నేపద్యంలో చేప పిల్లల విడుదల సమయంలో 25 మందికి మించి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శానిటైజర్ లు, మాస్క్ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu