తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవ సభ ఈనెల 29న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగనుంది. ఆరోజున తెలంగాణ టీడీపీ శాఖ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఎన్టీఆర్భవన్లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీపీ ముఖ్యనేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కిన నరసింహులు సహా పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈనెల 29న నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి కీలక చర్చలు జరిపారు. కాగా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఇక చాలా సంవత్సరాల విరామం తర్వాత, గత కొన్ని నెలల క్రితం ఖమ్మంలో జరిగిన విజయ శంఖారావ సభకు ప్రజలు భారీగా హాజరైన నేపథ్యంలో.. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగనున్న సభను కూడా విజయవంతం చేయాలని టీటీడీపీ నేతలు పట్టుదలగా ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రజల్లో తెలుగుదేశం పట్ల ఆదరణ చెక్కుచెదరలేదని అభిప్రాయపడ్డ నేతలు.. పార్టీ నాయకులు, క్యాడర్ మరిన్ని కార్యక్రమాలతో ప్రజలను నేరుగా కలిసి రాష్ట్రంలో పార్టీ ఉండాల్సిన ఆవశ్యకతను వివరించాలని నిర్ణయించుకున్నారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేయడానికి పార్టీ అధినాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ పేరుతో ప్రజలకు చేరువయ్యేందుకు ఒక కార్యక్రమాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE