తెరాస లోక్ సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు ఈ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. బంగారం, పెట్రోల్ మరియు డీజిల్ పై సుంకం పెంచడం వలన సామాన్య ప్రజలకి ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు హర్ ఘర్ జల్ అనే పధకం తో ఇంటింటికి నీళ్లు ఇవ్వాలని చూస్తుందని, కెసిఆర్ నాయకత్వం లోని తెరాస ప్రభుత్వం ఇప్పటికే మిషన్ భగీరధ తో తెలంగాణ లోని అన్ని జిల్లాలకు , ప్రతి ఇంటికి నీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం త్రాగు, సాగు నీటి పై కొత్తగా చేపట్టబోయే అన్ని ప్రాజెక్ట్స్, తెలంగాణ లో ఇప్పటికే ఘనంగా అమలు అవుతున్నాయి అని, ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొంచమైనా రాయితీ ఇస్తే బాగుండేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించకపోవడం పట్ల నిరాశ కలిగిందని, అర్బన్ ఇండియా పధకం లో హైదరాబాద్ వంటి నగరానికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదని, ఈ బడ్జెట్ పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిరాశ పరిచింది అని తెలిపారు.