కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోతోంది. ఇటవల ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ముఖ్య నేతలతో జరిపిన చర్చల నేపథ్యంలో.. తాజాగా సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. దీనిని రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అధికారికంగా ఆమోదించారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు దాదాపు మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన గురువారం తన పదవికి రాజీనామా చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
అయితే, రాజీనామా సమర్పించిన సమయంలో గవర్నర్ అందుబాటులో లేకపోవడం కొంత ఉత్కంఠ రేపింది. కానీ, లోక్భవన్లోని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్కు సిద్ధరామయ్య తన లేఖను అందజేశారు. ఈ క్రమంలో తాజాగా ఇండోర్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఈ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కీలక పరిణామాలు మరియు కేర్టేకర్ బాధ్యతలు
ముఖ్యమంత్రి రాజీనామా ఆమోదం పొందడంతో సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రస్తుత మంత్రిమండలి అధికారికంగా రద్దయింది. అయితే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి, కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే వరకు సిద్ధరామయ్యనే తాత్కాలిక (కేర్టేకర్) ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా గవర్నర్ తన నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత అధికార మార్పిడి ఒప్పందంలో భాగంగానే ఈ పరిణామం చోటుచేసుకుంది.
రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటా: సిద్ధరామయ్య స్పష్టీకరణ
ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు జాతీయ రాజకీయాల్లోకి రావాలని, రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ తాను దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. తన రాజకీయ జీవితం కర్ణాటకతోనే ముడిపడి ఉందని, చివరి శ్వాస వరకు రాష్ట్రంలోనే ఉంటూ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. కాగా, తదుపరి ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగా సాగుతోంది.





































