వైఎస్సార్సీపీ విధ్వంసకర విధానాలు, తప్పుడు పద్ధతులను ప్రజల ముందు ఎండగట్టాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందినప్పటికీ, ఆ పార్టీ ఇప్పటికీ సమాజంలో చిచ్చు రాజేసే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కుట్రలను బహిర్గతం చేస్తూ, ప్రజలతో నిత్యం మమేకమై ఉండడాన్ని బాధ్యతగా తీసుకోవాలని ప్రజాప్రతినిధులు మరియు నాయకులకు స్పష్టం చేశారు.
కూటమి పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నుంచి 45 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంపై ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
హామీలను నెరవేరుస్తున్నామని ప్రజలకు వివరిద్దాం – సీఎం చంద్రబాబు
ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లేయాలని కోరినట్లే, ఇప్పుడు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తున్నామో ప్రజలకు వివరించాలని చంద్రబాబు నాయుడు సూచించారు. గత ఎన్నికల్లో ప్రజలు సాధించిపెట్టిన చరిత్రాత్మక విజయం, 94% స్ట్రైక్ రేట్ మరియు 57% ఓట్ల సాధనను గుర్తుచేస్తూ.. నిరంతరం ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరూ ఈ 45 రోజుల కార్యక్రమంలో క్రియాశీలంగా పాల్గొనాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలనూ గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని, నాయకత్వ లక్షణాలను పెంచుకుంటూ ప్రజలు మరియు కార్యకర్తలతో సన్నిహితంగా ఉండాలని ఆదేశించారు.
45 రోజుల ప్రజాచైతన్య యజ్ఞాన్ని విజయవంతం చేయాలి: పల్లా శ్రీనివాసరావు
ఈ 45 రోజుల ‘ఇంటింటికీ టీడీపీ’ ప్రచార కార్యక్రమాన్ని శ్రేణులంతా కలిసి విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్-6 హామీలు, మహిళలు, రైతులు, యువత మరియు విద్యార్థులకు చేకూరిన లబ్ధిని ప్రతి గడపకూ తీసుకెళ్లాలని కోరారు.
వైఎస్సార్సీపీ పాలనలోని విధ్వంసానికి, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ అభివృద్ధి పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని, అమరావతి ఏకైక రాజధానితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రగతిని చాటిచెప్పాలని పేర్కొన్నారు.








































