సెప్టెంబర్‌ తొలి వారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు – సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

CM Chandrababu Says, Godavari Water For Anakapalli and Visakhapatnam by September First Week

అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. పలు అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. అనకాపల్లి అంటే కేవలం బెల్లానికి మాత్రమే ప్రసిద్ధి కాదని, ఇది కీలక పారిశ్రామిక ప్రాంతమని అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోనే అనకాపల్లి జిల్లా నంబర్‌-1గా నిలవాలని ఆకాంక్షించారు.

అనకాపల్లికి గోదావరి నీళ్లు

అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తనదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలోనే అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలను తీసుకొస్తామని తెలిపారు. జిల్లాలోని ప్రతి చెరువు, రిజర్వాయర్‌ను నీటితో నింపేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సెప్టెంబరు తొలి వారంలోనే అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చి చూపిస్తామని వెల్లడించారు.

ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలు అభినందిస్తే అదే తనకు పెద్ద ఉత్సాహాన్ని ఇస్తుందని చంద్రబాబు అన్నారు.

డేటా సెంటర్లతో లక్షల ఉద్యోగాలు

రాష్ట్రంలో అభివృద్ధి పనులను కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం విమర్శించారు. డేటా సెంటర్లపై విమర్శలు చేస్తున్న వారికి వాటి ప్రాధాన్యత తెలియదని అన్నారు. డేటా సెంటర్లు వస్తే లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు.

అమరావతికి దేశంలోనే తొలిసారిగా క్వాంటం కంప్యూటర్‌ రాబోతోందని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాంకేతికతను నేర్చుకోవాలని సూచించారు. AIపై పట్టు సాధిస్తే భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు.

అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ కూడా భాగమే

అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు, పెట్టుబడులు మాత్రమే కాదని చంద్రబాబు అన్నారు. పర్యావరణ పరిరక్షణ కూడా అభివృద్ధిలో కీలక భాగమని చెప్పారు. చెత్త నుంచి కంపోస్ట్‌, విద్యుత్‌, గ్యాస్‌ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని జీరో వేస్ట్‌ పంచాయతీగా తీర్చిదిద్దాలని సూచించారు.

మహిళల కోసం మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మూడు గ్యాస్‌ సిలిండర్లకు సంబంధించిన మొత్తాన్ని నాలుగు నెలలకు ఒకసారి జమ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇండక్షన్‌ స్టవ్‌ల వినియోగాన్ని కూడా ప్రోత్సహించాలని సూచించారు.

వైసీపీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. కల్తీ మద్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోయాయని, పలు ప్రాంతాల్లో భూకబ్జాలు జరిగాయని ఆరోపించారు. గత పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి తమ ప్రభుత్వానికి మూడేళ్లు పట్టిందన్నారు.

విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్రమంగా గాడిలో పెడుతున్నామని, అదే సమయంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు నిజాయితీగా ఉంటే తప్పుడు రాజకీయాలు చేసేవాళ్లు భయపడతారని సీఎం పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here