డిజిటల్ రుణాల పేరుతో రుణగ్రహీతలను వేధించడం, రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడటాన్ని అడ్డుకునేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ రుణాల రికవరీ ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రుణగ్రహీతల హక్కులను పరిరక్షించడంతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల బాధ్యతను పెంచడం ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం. కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
రికవరీ కాల్స్కు సమయ పరిమితి
కొత్త మార్గదర్శకాల ప్రకారం రుణ వసూలు కోసం రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే రుణగ్రహీతలను సంప్రదించాలి. ఈ సమయాలకు వెలుపల ఫోన్ చేయడం లేదా ఇతర మార్గాల్లో సంప్రదించడం నిషేధం. రుణ వసూలు పేరుతో అసభ్య పదజాలం ఉపయోగించడం, బెదిరించడం, సామాజిక మాధ్యమాల ద్వారా వేధించడం వంటి చర్యలపైనా ఆర్బీఐ కఠినంగా వ్యవహరించనుంది.
ప్రత్యేక పరిస్థితుల్లో వేధింపులు వద్దు
రుణగ్రహీత కుటుంబంలో మరణం సంభవించినప్పుడు, వైద్య అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు లేదా ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్న సమయంలో రికవరీ పేరుతో ఇబ్బందులకు గురిచేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. రుణ వసూలు ప్రక్రియలో మానవీయ దృక్పథాన్ని పాటించాలని సూచించింది.
రికవరీ కాల్స్ రికార్డు తప్పనిసరి
రుణ వసూలుకు సంబంధించి రికవరీ ఏజెంట్లు చేసే ప్రతి కాల్ను రికార్డు చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. ఈ రికార్డులను కనీసం ఆరు నెలల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. రుణగ్రహీతల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత సంభాషణలను పరిశీలించేందుకు ఈ నిబంధన ఉపయోగపడనుంది.
ఫోన్ లాకింగ్పై కూడా కొత్త రూల్స్
డిజిటల్ రుణాల విషయంలో ఫోన్ లాకింగ్ యాప్ల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కూడా ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. రుణం బకాయి ఉందనే కారణంతో ఫోన్ను లాక్ చేసినప్పటికీ ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది.
రుణగ్రహీత బకాయిని చెల్లించిన తర్వాత గంటలోపు డిజిటల్ లాక్ను తొలగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగితే ప్రతి అదనపు గంటకు రూ.250 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు పేర్కొంటున్నాయి.
ఏజెంట్ల తప్పిదాలకు బ్యాంకులదే బాధ్యత
రికవరీ ఏజెంట్లు నిబంధనలను ఉల్లంఘించిన సందర్భంలో సంబంధిత బ్యాంకులు, ఆర్థిక సంస్థలు బాధ్యత నుంచి తప్పించుకోలేవని ఆర్బీఐ స్పష్టం చేసింది. రికవరీ కార్యకలాపాలను అవుట్సోర్స్ చేసినప్పటికీ, ఏజెంట్ల చర్యలకు సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
రుణగ్రహీతలకు ఊరట
కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత డిజిటల్ రుణాల రికవరీలో అక్రమ పద్ధతులు, బెదిరింపులు, అనుచిత వేధింపులకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. రుణగ్రహీతల గోప్యత, గౌరవం, భద్రతను కాపాడటంతో పాటు డిజిటల్ రుణ రంగంలో జవాబుదారీతనం పెంచేందుకు ఈ నిబంధనలు దోహదపడతాయని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.








































