ఏపీ వైద్య రంగంలో ‘సంజీవని’ ఒక గేమ్ ఛేంజర్ – సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu Calls Sanjeevani Project is A Game Changer in Medical Sector

అమరావతి వేదికగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజారోగ్య వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టే ‘సంజీవని’ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో గేమ్‌చేంజర్‌గా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సంజీవని అమలు

సంజీవని కార్యక్రమాన్ని ఏపీ అంతటా పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ప్రతి నెల నాలుగో శనివారాన్ని ‘సంజీవని హెల్త్ డే’గా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ రోజున ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ప్రతి పౌరుడికీ డిజిటల్ హెల్త్ రికార్డ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డు రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు.

వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స అందించడం కంటే ముందుగానే ఆరోగ్య సమస్యలను గుర్తించి నియంత్రించే విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అవసరమైన సమయంలో సరైన వైద్యం అందేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు.

కుటుంబమే ప్రామాణికం

ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కూడా కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించే విధంగా అమలు చేయాలని సీఎం సూచించారు. కుటుంబ స్థాయిలో అవసరాలను గుర్తించి సేవలు అందిస్తే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు మరింత సమర్థంగా ప్రజలకు చేరుతాయని తెలిపారు.

పేద, మధ్యతరగతికి వైద్య భారం తగ్గింపు

పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయంలో గణనీయమైన భాగం వైద్యం, విద్యపైనే ఖర్చవుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా లేదా తక్కువ ఆర్థిక భారంతో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కుటుంబాలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించవచ్చని అన్నారు.

సంజీవని ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించడం వల్ల భవిష్యత్తులో భారీ వైద్య ఖర్చులను కూడా నివారించే అవకాశం ఉంటుందని వివరించారు.

కుప్పం, చిత్తూరులో పైలట్ ప్రాజెక్టు

కుప్పం, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే నిర్వహించిన పైలట్ కార్యక్రమం ద్వారా హైపర్‌టెన్షన్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలో సానుకూల ఫలితాలు నమోదయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు.

ఈ అనుభవాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని మరింత సమర్థంగా విస్తరించాలని చంద్రబాబు సూచించారు. సాంకేతికత, ముందస్తు వ్యాధి నిర్ధారణ, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలను సమన్వయం చేసి రాష్ట్ర ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here