కేరళంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన

AP Dy CM Pawan Kalyan Visits Thriprayar, Guruvayur and Mammiyoor Temples in Keralam

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేరళం పర్యటనలో ఆధ్యాత్మిక సందర్శనలు కొనసాగిస్తున్నారు. ఆయుర్వేద వైద్య చికిత్సను పూర్తి చేసుకున్న ఆయన.. కేరళంలోని ప్రముఖ ఆలయాలను వరుసగా దర్శించుకుంటున్నారు. త్రిప్రయార్ శ్రీరామ స్వామి ఆలయం, గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, మమ్మీయూర్ మహాదేవ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

కేరళంలో ప్రసిద్ధి చెందిన నాలాంబలం యాత్రలో భాగమైన త్రిప్రయార్ శ్రీరామ స్వామి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఒక రోజు దీపారాధన సేవ నిర్వహణ కోసం విరాళం అందించారు. అనంతరం స్వయంగా దీపాలు వెలిగించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని తిరువా నదిలో చేపలకు ఆహారం అందించే ‘మీనుట్టు’ సేవలో పాల్గొనడంతో పాటు సంప్రదాయ ‘వేదివజిపాడు’ సేవలోనూ పాల్గొన్నారు.

అనంతరం గురువాయూర్ శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకే ఆలయానికి చేరుకున్న ఆయన.. అత్యంత పవిత్రమైన ‘నిర్మాల్య దర్శనం’ చేసుకున్నారు. స్వామివారి మూలవిరాట్‌కు అలంకరించిన గంధాన్ని తొలగించే ముందు జరిగే తొలి దర్శనాన్ని నిర్మాల్య దర్శనంగా పరిగణిస్తారు.

నిర్మాల్య దర్శనం అనంతరం ఆలయంలో నిర్వహించిన తైలాభిషేకం, వాకచార్థు, శంఖాభిషేక సేవలను తిలకించారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం గురువాయూర్ ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలను కూడా దర్శించుకున్నారు. వినాయక స్వామి, ఆంజనేయ స్వామి, అనంత పద్మనాభ స్వామి, భగవతి అమ్మవారు, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తర్వాత మమ్మీయూర్ మహాదేవ ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్.. శివపార్వతులను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాలు, కలభం, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.

ఆయుర్వేద చికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ కేరళంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను వరుసగా దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్రిప్రయార్ శ్రీరామ స్వామి ఆలయం నుంచి గురువాయూర్, మమ్మీయూర్ మహాదేవ క్షేత్రం వరకు ఆయన పర్యటన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొనసాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here