ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ హైదరాబాద్ నగరంలోని నానక్రామ్గూడలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. పదిఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణంలో పది వేల మందికి పైగా ఉపాధి కల్పించేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేసారు. ఈ ప్రాంగణం నుంచి అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార మరియు సాంకేతిక కార్యకలాపాలను నిర్వహించనుంది. 2016 లో అప్పటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకున్న ఈ ప్రాంగణం, మూడేళ్ళ పాటు నిర్మాణం జరిగి ఆగస్టు 21, 2019 బుధవారం నాడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్ మరియు అమెరికాకు చెందిన గ్లోబల్ రియల్ ఎస్టేట్ అండ్ ఫెసిలిటీస్ డైరెక్టర్ జాన్ స్కోట్లర్ పాల్గొనబోతున్నారు. 15 అంతస్తులతో, 30 లక్షల చదరపు అడుగుల స్థలంలో అన్ని వసతులతో అత్యాధునికంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. హైదరాబాద్ లో ఏడువేలమంది ఉద్యోగులున్న అమెజాన్, త్వరలో తన సంఖ్యను పది వేలకు పెంచుకోనుంది . ఇప్పటికే శంషాబాద్ ప్రాంతంలో అమెజాన్ పెద్ద స్థాయిలో ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసుకుంది. ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ స్థాయిలో హైదరాబాద్ లో కార్యకలాపాలు మొదలు పెట్టడంతో ఇప్పటికే ఉన్న సంస్థలతో పాటు, ఇతర సంస్థలు కూడ భారీస్థాయిలో పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకునే వీలుందని పరిశీలకులు భావిస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=aeIG8qK7MQ0]