కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్సభ సభ్యునిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ఖండిస్తూ, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ట్వీట్ చేశారు. “రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అనేది రాజ్యాంగాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం. ఈ అంశంలో చూపిన తొందరపాటు అత్యంత అప్రజాస్వామికం. నేను దీనిని ఖండిస్తున్నాను” అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
అలాగే మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేస్తూ, “రాహుల్ గాంధీని పార్లమెంట్కు అనర్హులుగా ప్రకటించడం బీజేపీ యొక్క నియంతృత్వం, దురహంకారం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులు ప్రమాదంలో ఉన్నాయి” అని పేర్కొన్నారు.
ముందుగా 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్లో జరిగిన లోక్సభ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ..ఇలా దొంగలందరికీ ఇంటి పేరు మోదీ అని ఉంది అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీంతో ప్రధాని మోదీ ఇంటి పేరు వాడి కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కాగా, ఈ కేసును విచారించిన అనంతరం సూరత్ కోర్టు గురువారం రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. రాహుల్ అభ్యర్ధన మేరకు వ్యక్తిగత పూచికత్తుపై వెంటనే బెయిల్ మంజూరు చేసి, ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల సమయం ఇచ్చింది. అయితే ఈ కేసులో దోషిగా తేలడం, 2 ఏళ్ల శిక్ష పడిన నేపథ్యంలో లోక్సభ సభ్యునిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియట్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE