సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో రాజధాని నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని నిర్మాణం పై స్పందిస్తూ ఈ ప్రాంతం కట్టడాలకు సురక్షితం కాదని, సాధారణ ప్రాంతాల్లో నిర్మాణాలకు ఒక లక్ష రూపాయలు వెచ్చిస్తే అమరావతిలో నిర్మాణాలకు మరో లక్ష అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని బొత్స పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి సురక్షితం కాదని గతంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పుడు వాస్తవమే అనిపిస్తుందని, దీని పైన మళ్ళీ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అన్ని అంశాలపై చర్చించి త్వరలోనే అమరావతి పై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మంగళవారం నాడు విశాఖపట్నంలో విలేకర్ల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఇటీవల వచ్చిన వరదల వలన ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడలేదని, తెలుగుదేశం పార్టీ నాయకులు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. అమరావతి ప్రాంతంలో వరదలొస్తే మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయని వాటికోసం మళ్ళీ కాలువలు, డ్యాములు కట్టాల్సిన ఉంటుందని చెప్పారు. అమరావతి పై మంత్రి వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇటువంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, త్వరలోనే అమరావతి పై ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తామని చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
[subscribe]
[youtube_video videoid=KHc_LtwNmWA]