కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించి భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. “కొవాగ్జిన్” పేరుతో భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సంయుక్తంగా తయారుచేస్తున్న ఈ వ్యాక్సిన్ ను మానవులపై ఫేజ్-1, ఫేజ్-2 ప్రయోగాలు చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అవుతున్నాయి.
కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లో విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిని, తెలంగాణలో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిని ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. దీంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి నిమ్స్లో ప్రారంభమైంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి, వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. అనంతరం ఆరోగ్యంగా ఉన్నవారికే ఫేజ్-1 కింద వ్యాక్సిన్ డోస్ ఇచ్చే అవకాశమునట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ నెలలోనే దేశంలో మొత్తం 12 సెంటర్లలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu