మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో మరో అంశం చోటు చేసుకుంది. ఎన్నికలకు కొన్ని రోజులు ముందు జరిగి, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో పోలీసులు లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి అనుమానితుడిగా ఆరోపణలు ఎదురుకుంటున్న శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసునూరులో శ్రీనివాసులు రెడ్డి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించగా కడపలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. వివేకా హత్యకేసులో పోలీసులు విచారణకు పిలిచారని, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ లో రాసి పెట్టాడు.
వివేకా హత్యకేసుకు సంబంధించి పలుమార్లు విచారణకు పిలిచిన నేపథ్యంలోనే శ్రీనివాసులు రెడ్డి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు చెబుతున్నారు. సీఎం జగన్, వైఎస్ భాస్కర్ రెడ్డికి వేర్వేరుగా శ్రీనివాసులు రెడ్డి లెటర్లు రాసినట్టు తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న పరమేశ్వర్ రెడ్డికి శ్రీనివాసులు రెడ్డి బావ అవుతాడు. తన బావను ఈ కేసులో పోలీసులు పలుమార్లు వేధించారని,ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా నార్కో పరీక్షల కోసం గుజరాత్ తీసుకెళ్లారని పరమేశ్వర్ రెడ్డి మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఆత్మహత్య వ్యవహారంపై ఉన్నతాధికారుల ఆదేశంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
[subscribe]
[youtube_video videoid=0WYb2PFAsSY]