నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి రేపే ఉప ఎన్నిక జరగనుంది. బుధవారం నాటితో ఈ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. రేపటి పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మొత్తం 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 28 కేంద్రాలను, కామారెడ్డి జిల్లాలో 22 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. టిఆర్ఎస్ పార్టీ తరపున నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ పార్టీ తరపున సుభాష్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా లక్ష్మీ నారాయణ పోతంకర్ పోటీలో ఉన్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మెజార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులంతా( జెడ్పీటిసీ, ఎంపీటిసీ) టిఆర్ఎస్ పార్టీ సభ్యులే కావడంతో టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గెలుపు ఖాయం కానుంది. ఆమెకు భారీ మెజార్టీ వచ్చే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
ముందుగా పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో నిజామాబాద్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని అప్పటి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అనర్హుడిగా ప్రకటించారు. టిఆర్ఎస్ సభ్యుడిగా ఎన్నికైన భూపతిరెడ్డి, ఆతర్వాత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించాడని ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని టిఆర్ఎస్ శాసనమండలి పక్షం మండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేయడంతో అనర్హత వేటు వేశారు. ఈ అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగనుంది.
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వివరాలు:
- పోలింగ్ తేదీ: అక్టోబర్ 9 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
- ఓట్ల లెక్కింపు పక్రియ: అక్టోబర్ 12
- ఉప ఎన్నిక పక్రియ ముగింపు: అక్టోబర్ 14
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu