కర్నాటక రాష్ట్రంలోని కలబురగి బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేల పరిహారాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పార్థివ దేహాలను వారి స్వస్థలాలకు తరలించడం, క్షతగాత్రులకు వైద్య సాయం అందించడం వంటి చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ముందుగా కర్నాటక రాష్ట్రంలోని కలబురిగిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో, బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ వాసులు మరణించడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్నాటక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని క్షతగాత్రులైన వారికి సరైన వైద్యం అందేలా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం కర్ణాటకలోని కలబురిగి జిల్లా కమలాపుర వద్ద గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును మినీ లారీ ఢీకొట్టింది. దీంతో ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హైదరాబాద్కు చెందిన 8 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. అలాగే మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కలబురిగిలోని 3 ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో హైదరాబాద్కు చెందిన రెండు కుటుంబాలు వారే 32 మంది ఉన్నట్టు తెలుస్తుంది. వారు బర్త్ డే పార్టీ వేడుకల కోసం గోవా వెళ్లి తిరిగి హైదరాబాద్కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF