దేశంలో మహిళలు, పిల్లలపై రోజురోజుకి దారుణాలు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత, ఆయా కేసుల్లో నిందితులపై తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు చెందిన చట్టాలు, నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు పాటించకుండా, బాధ్యతగా వ్యవహరించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం నాడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ మేరకు అనుసరించాల్సిన కొన్ని మార్గదర్శకాలను కేంద్ర హోమ్ శాఖ జారీ చేసింది.
కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలు:
- లైంగిక దాడి కేసుల్లో అన్నిరాష్ట్రాలు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అలాగే పోలీస్ స్టేషన్ పరిధికి వెలుపల నేరం జరిగితే ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయడానికి పోలీసులను అనుమతి ఉందని పేర్కొన్నారు.
- గుర్తించిన నేరాలకు సంబంధించి అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో విఫలమైతే వివిధ సెక్షన్ల కింద ప్రభుత్వం విధించే శిక్షకు అర్హుడవుతారు.
- లైంగిక దాడి కేసుల్లో సాక్ష్యాలను సేకరించేందుకు సెక్సువల్ అసల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్లను ఉపయోగించాలి.
- అత్యాచారానికి సంబంధించిన కేసుల్లో దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాలని పోలీసులకు ఆదేశాలు.
- లైంగిక వేధింపులకు లేదా అత్యాచారానికి గురైన బాధితురాలిని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ సమ్మతితో ఇరవై నాలుగు గంటలలోగా నేరానికి సంబంధించిన సమాచారాన్ని స్వీకరించేలా వైద్యపరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి.
- లైంగిక నేరాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ (ఐటిఎస్ఎస్ఓ) అనే ఆన్లైన్ పోర్టల్ను కేంద్రం ప్రారంభించింది. ఇది లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- మహిళలపై జరిగే దాడుల్లో పోలీసులు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu