మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన అప్పులు తెలంగాణకు పెద్ద ముప్పుగా మారాయి – సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy Says, Former Chief Minister KCR’s Debt Has Become Major Burden on Telangana

తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం మంచి చేసినా, లోపాలు ఉన్నా ప్రజలు ప్రశ్నించే హక్కు ఉంటుందని, వాటిని చర్చించుకుంటూ ముందుకు సాగాలని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ దొరల గడీల పాలనకు అవకాశం ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు.

2029 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. గతంలో డీఎస్‌, వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలయికతో కాంగ్రెస్‌ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో కలిసి అదే తరహాలో 2029లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకు గౌడ సామాజిక వర్గం సహకరించాలని కోరారు.

ట్యాంక్‌బండ్‌పై సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహావిష్కరణ

సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ 376వ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పాపన్నగౌడ్‌ కేవలం ఒక సామాజిక వర్గం కోసం కాకుండా బహుజనులందరి కోసం పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు.

వివిధ వర్గాలను ఏకం చేసి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసి బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడిగా పాపన్నగౌడ్‌ను సీఎం అభివర్ణించారు. ఆయన చరిత్ర, పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ ప్రేరణగా నిలవాలని అన్నారు.

పాపన్నగౌడ్‌ జయంతి, వర్ధంతి రోజుల్లో మాత్రమే ఆయనను స్మరించకుండా.. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి ప్రజలకు నిరంతరం గుర్తుండేలా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు.

ఛత్రపతి శివాజీతో పాపన్నగౌడ్‌ పోలిక

మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీకి మరాఠీలు ఎంతటి గౌరవం ఇస్తారో.. తెలంగాణలో పాపన్నగౌడ్‌కు కూడా అంతే గౌరవం ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పాపన్నగౌడ్‌ ధైర్యం, పౌరుషం, పోరాటం, వీరత్వం గురించి బ్రిటిషర్లు కూడా గ్రంథాలు రాశారని గుర్తు చేశారు.

ముదిరాజ్‌ సామాజిక వర్గానికి ఆరాధ్యుడైన పండుగ సాయన్నను కూడా ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు. అక్టోబర్‌ 22న పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు.

గీత కార్మికుల సంక్షేమానికి చర్యలు

గీత కార్మికుల సంప్రదాయ వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న గీత, నేత కార్మికులందరికీ పెన్షన్లు అందేలా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.

ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కాలువ గట్ల వెంట తాటి, ఈత చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపడితే గీత కార్మికులకు దీర్ఘకాలికంగా ఉపాధి లభిస్తుందని అన్నారు. చెట్లు పెరగడానికి కొన్ని సంవత్సరాలు పట్టినా.. ఆ తర్వాత తరతరాల పాటు సంప్రదాయ వృత్తిని కొనసాగించేందుకు అవి ఉపయోగపడతాయని చెప్పారు.

7 లక్షల ఇందిరమ్మ ఇళ్లపై సీఎం కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. గత పదేళ్ల పాలనలో పేదల ఇళ్లపై తగినంత దృష్టి పెట్టలేదని మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించారు.

కేసీఆర్‌ హయాంలో కుటుంబ ప్రయోజనాలకు ప్రాధాన్యం లభించిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని సీఎం అన్నారు.

గద్దర్‌, అందెశ్రీ వంటి తెలంగాణ ఉద్యమానికి చెందిన ప్రముఖులను కాంగ్రెస్‌ ప్రభుత్వం గౌరవించిందని చెప్పారు. గద్దర్‌ అవార్డులను ఏర్పాటు చేయడంతో పాటు.. ‘జయ జయహే తెలంగాణ’ పాటకు అధికారిక గుర్తింపు కల్పించామని గుర్తు చేశారు. మాదిగ ఉపకులాల వర్గీకరణ, బీసీ కులగణన వంటి అంశాల్లోనూ తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.

రూ.8.11 లక్షల కోట్ల అప్పు.. ప్రభుత్వంపై భారమైంది

గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారంగా మారాయని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంపై సుమారు రూ.8.11 లక్షల కోట్ల అప్పు ఉందని పేర్కొన్నారు.

ప్రతి ఏడాది సుమారు రూ.75 వేల కోట్ల వరకు అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏర్పడిన ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటూనే సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని వివరించారు.

బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం ఆరోపించారు. ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మడం లేదని అన్నారు.

పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే చదువే మార్గం

కులవృత్తులను గౌరవిస్తూనే పిల్లలకు ఉన్నత విద్య అందించాలని సీఎం రేవంత్‌ సూచించారు. పెద్దలు తమ పరిస్థితులను మార్చుకోలేకపోయినా.. తమ పిల్లల భవిష్యత్తును మాత్రం మార్చగలరని అన్నారు.

గత పాలకులు కొన్ని వర్గాలను సంప్రదాయ వృత్తులకే పరిమితం చేశారని విమర్శించిన సీఎం.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల పిల్లలకు విద్య, ఉన్నత అవకాశాలు అందించడంపై దృష్టి పెట్టిందని చెప్పారు.

“మన పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే చదువు ఒక్కటే ప్రధాన మార్గం” అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here