హైదరాబాద్ నగరంలో మూడు, నాలుగు రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం మరోసారి కుండపోత వర్షం కురిసింది. నగరంలోని దిల్సుఖ్ నగర్, కొత్తపేట, చార్మినార్, అఫ్జల్గంజ్, మెహిదీపట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, అంబర్పేట, ముషీరాబాద్, నారాయణగూడ, కోఠి, లక్డీకాపూల్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్సిటీ, కొండాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, కుషాయిగూడ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో రోడ్లు అన్ని జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వరద నీరు చేరుతుంది.
నగరంలో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని జీహెఛ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ప్రజలకు ముందుగానే సూచించింది. ఈ సమయంలో పౌరులు బయటకు రావొద్దని, ఇంటి లోపల ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను వెంటనే జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపులకు తరలించాలని కమిషనర్ లోకేశ్కుమార్ అధికారులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగర ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu