తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి కొంచెం ఊరట లభించింది. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం నాడు వాదనలు ముగిశాయి. చట్టబద్ధంగా ఎన్నికలకు ముందు జరిగే ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకోవచ్చని హైకోర్టు ప్రభుత్వానికి తెలిపింది. అయితే మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లు తేలేంత వరకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. దసరా సెలవుల అనంతరం ఎన్నికలపై విచారణ చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది. ఒకసారి ఎన్నికల ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తే 27 రోజుల లోపలే మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎన్నికల సంఘం హైకోర్టుకు వివరించింది.
మరో వైపు సచివాలయం కూల్చివేత నిర్ణయంపై తెలంగాణ హైకోర్టు నో చెప్పింది. సచివాలయం కూల్చివేతపై దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టే ఇచ్చింది. అక్టోబర్ 14 వరకు సచివాలయ కూల్చివేతలు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 3 నుంచి 11 వరకు హైకోర్టుకు సెలవులున్న నేపథ్యంలో సెలవుల తర్వాత విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. ఈ రోజు జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో సచివాలయ భవనాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
[subscribe]