తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై సీపీ రంగనాథ్ బుధవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించి పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బండి సంజయ్ వ్యవహరించారని, అందుకే ముందస్తు చర్యగా ఆయనను అరెస్ట్ చేశామని తెలిపారు. కమలపూర్లో పేపర్ లీకేజ్లపై బండి సంజయ్ ప్రెస్ నోట్ ఇచ్చారని, ఈ వ్యవహారానికి ప్రభుత్వమే బాధ్యతంటూ విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని, పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగేలా ఆందోళనలు చేయాలని బీజేపీ శ్రేణులకు ఉద్దేశపూర్వకంగా పిలుపునిచ్చారని వెల్లడించారు.
ఇక బండి సంజయ్ చర్యల వల్ల పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలోపెట్టుకుని, పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్ని ప్రివెన్షన్ కింద అరెస్ట్ చేశామని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. కీలక నిందితుడు ప్రశాంత్ బండి సంజయ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కూడా వాట్సాప్ లో ప్రశ్నాపత్రం పంపించాడని, ఈ క్రమంలో అతడు మొత్తం 149 మందితో మాట్లాడాడని వివరించారు. ఇక కీలక నిందితుడు బూర ప్రశాంత్ బండి సంజయ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కూడా వాట్సాప్ లో ప్రశ్నాపత్రం పంపించాడని, ఈ క్రమంలో అతడు మొత్తం 149 మందితో మాట్లాడాడని వివరించారు.
ఇక ఈ సంఘటనకు ముందురోజు బండి సంజయ్, ప్రశాంత్ ఇరువురూ చాలాసేపు వాట్సాప్ లో చాటింగ్ చేసుకున్నారని, దీని ఆధారంగానే ఈ కేసులో సంజయ్ను ఏ1గా చేర్చామని వెల్లడించారు. ఈరోజు విచారణలో బండి సంజయ్ కూడా నేరాన్ని అంగీకరించారని, ఇంకా ఈ కేసులో మరికొంతమందిని విచారించాల్సి ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని సీపీ రంగనాథ్ ప్రకటించారు. కాగా హనుమకొండ జిల్లా కమలాపూర్లో టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీక్ అయిన ఘటనలో బండి సంజయ్ను మంగళవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. అలాగే మరోవైపు ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు సైతం మండిపడ్డారు. పేపర్ లీకేజీ నిందితుల విడుదల కోసం బీజేపీ నేతలు ధర్నా చేస్తున్నారని, తమ రాజకీయ ప్రయోజనం కోసం విద్యార్థుల జీవితాలను నాశనం చేయడానికి సైతం వెనుకాడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో బండి సంజయ్ను ఏ1గా చేర్చిన కమలాపూర్ పోలీసులు.. ఆయనపై తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. దీంతో పాటు ఐపీసీ సెక్షన్ 120 బీ, సెక్షన్ 420 కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఏ2గా బూర ప్రశాంత్, ఏ3గా మహేష్, ఏ4గా బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సుభాష్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్ను పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో చేర్చారు. ఈ క్రమంలో బండి సంజయ్ను బుధవారం సాయంత్రం పోలీసులు హనుమకొండలో జడ్జి అనిత రాపోలు ఎదుట ప్రవేశపెట్టారు. జడ్జి నిర్ణయాన్ని బట్టి పోలీసులు బండిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE