తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 12, శనివారం నాడు ప్రగతి భవన్లో ఆర్టీసీ సమ్మెపై మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్రంలో రవాణా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కీలక సూచనలు చేసారు. అదే విధంగా సమ్మె కొనసాగిస్తున్న వారితో ఇకపై ఎలాంటి చర్చలు జరపబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ప్రజల అవసరాల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఆర్టీసీలో కొత్త నియామకాలకు సంబంధించి చర్చలు జరిపారు. సమ్మెలో పాల్గొనకుండా ఉన్నవారికే సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మూడు రోజుల్లో వందకు వందశాతం ఆర్టీసీ బస్సులు నడిచితీరాలని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెలో పాల్గొని, తమంతట తాముగా అనధికారంగా విధులకు గైర్హాజరైన వారిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఉద్యోగాల్లోకి చేర్చుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ప్రకటించారు. 50 శాతం ఆర్టీసీ బస్సులను నడపడానికి అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించుకోవాలని, 30 శాతం బస్సులు అద్దె ప్రాతిపదికన, 20 శాతం ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్ పర్మిట్లు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. సమ్మె నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా అక్టోబర్ 19వ తేదీ వరకూ దసరా సెలవులను పొడిగిస్తునట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
[subscribe]