తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు దసరా సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా అక్టోబర్ 19వ తేదీ వరకూ దసరా సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం అక్టోబర్ 12, శనివారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సమ్మెపై ప్రగతి భవన్లో శనివారం రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్రంలో రవాణా ఏర్పాట్లపై చర్చించి సెలవుల పెంపుపై ఆదేశాలు జారీ చేసారు.
రాష్ట్రంలోని అనేక గ్రామాలలో, పట్టణాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి ఉండడం వలన సెలవుల పొడిగింపుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. 19వ తేదీ లోపు అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో బస్సులు సమకూర్చుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అయితే ఈ సెలవుల పొడిగింపు కారణంగా మిగిలిన ఈ విద్యా సంవత్సరంలో ఇకపై రెండో శనివారం సందర్భంగా ఇచ్చే సెలవులను రద్దు చేయచేసి, ఆ రోజున కూడ విద్యాసంస్థలు పనిచేసేలా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.
[subscribe]