ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ పార్టీలో కీలక నేతగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ మార్చి 18, 2017 నుండి మార్చి 09, 2021 వరకు నాలుగు సంవత్సరాల పాటుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో సొంత బీజేపీ పార్టీ నేతల నుంచే త్రివేంద్ర సింగ్ రావత్ కు వ్యతిరేకత రావడంతో నాయకత్వ మార్పుపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే త్రివేంద్ర సింగ్ రావత్ తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్యకు సమర్పించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాఖండ్ కు నాలుగేళ్లపాటు సేవ చేసే అవకాశాన్ని బీజేపీ తనకు ఇచ్చిందని, ఇది తన జీవితంలో ఒక సువర్ణావకాశం అని చెప్పారు. పార్టీలో అంతర్గత చర్చ జరిగిందని, నాయకత్వ బాధ్యత మరొకరికి ఇవ్వాలనే ఏకాభిప్రాయం వచ్చిందని అన్నారు. మరోవైపు కొత్త ముఖ్యమంత్రి ఎన్నుకునేందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్ సహా పలువురు కీలక నేతలు డెహ్రాడూన్ కు చేరుకొనున్నారు. అలాగే ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలందరూ రేపు ఉదయం 10 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్నారు. మరో ఏడాదిలో ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానాన్ని కలిసిన మరుసటి రోజే సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ