దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. బుధవారం నాడు ఒక్కరోజే 17282 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై సమీక్షించేందుకు గురువారం నాడు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ (వారాంతపు కర్ఫ్యూ) విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, జిమ్లు, ఆడిటోరియంలు, మరియు స్పాలు పూర్తిగా మూసివేయబడతాయని చెప్పారు. ఇక వీక్ డేస్ లో సినిమా థియేటర్లు 30 శాతం సీటింగ్ సామర్థ్యంతో అనుమతించబడతాయని అన్నారు. వీకెండ్ కర్ఫ్యూ సమయంలో ఇప్పటికే నిర్ణయించబడిన వివాహాలు, ఇతర ముఖ్యమైన కార్యకలాపాలు పాస్ లతో అనుమతించబడతాయని తెలిపారు. రెస్టారెంట్స్ లో హోమ్ డెలివరీలు మరియు టేకావేలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
మరోవైపు సామాజిక, మత, రాజకీయ కార్యకలాపాలపై నిషేధం ఉంటుందని అన్నారు. వివాహాలకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ నిబంధనలు ప్రజలకు అసౌకర్యంగా ఉన్నప్పటికీ కరోనా వైరస్ ట్రాన్స్మిషన్ ను విచ్ఛిన్నం చేయడానికి వీకెండ్ కర్ఫ్యూ అవసరమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రజలెవరూ భయపడవద్దని, వీకెండ్స్ కర్ఫ్యూలో అన్ని అవసరమైన సేవలు లభిస్తాయని చెప్పారు. మరోవైపు ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తం 7,67,438 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 7,05,162 మంది కరోనా నుంచి కోలుకోగా, 11,540 మంది మరణించారు. ప్రస్తుతం 50,736 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ