తెలంగాణ రాష్ట్రంలో గత 45 రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెపై హైకోర్టులో పలు పిటిషన్స్ దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై నవంబర్ 18, సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరుగుతుంది. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆయన కోర్టును కోరారు. ‘చట్టం ప్రకారం సమ్మెకు వెళ్తున్నట్టు ఆరువారాల ముందు నోటీసు ఇవ్వాలి, కనీసం 14 రోజుల ముందైనా ప్రభుత్వానికి తెలపాలి, కానీ కార్మికులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. కార్మికులు చట్ట ప్రకారం నడుచుకోనందువలన కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని’ అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. అలాగే ఆర్టీసీ కార్మికులు ప్రతిపాదించిన డిమాండ్లను పరిష్కరించలేమని హైకోర్టుకు తెలిపారు. సమ్మె కారణంగా ఆర్టీసీ కార్పొరేషన్ ఇప్పటికే 44శాతం నష్టపోయిందని చెప్పారు. కార్మిక సంఘాలు విలీన డిమాండ్ ను తాత్కాలికంగా పక్కనపెట్టిన, భవిష్యత్ లో ఇదే డిమాండ్ మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశముందని అన్నారు.
అదనపు అడ్వకేట్ వ్యాఖ్యలపై హైకోర్టు స్పందిస్తూ, సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే హక్కు కేవలం కార్మిక న్యాయస్థానానికి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. మరో వైపు కార్మికుల డిమాండ్లపై చర్చించేలా ప్రభుత్వాన్ని ఆదేశించామని ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాది హైకోర్టును కోరగా, డిమాండ్లపై కమిటీ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని పేర్కొంది. అయితే కార్మికుల సమ్మె రోజు రోజుకి ఉధృతమవుతోంది, జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో- కన్వీనర్ రాజిరెడ్డి ఆసుపత్రిలో నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు నవంబర్ 19న ప్రతిపక్ష పార్టీలు మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా సడక్ బంద్ నిర్వహణకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమవుతున్నారు.
[subscribe]