ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జనవరి 2, గురువారం నాడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా ఏసీబీ పనితీరుపై అయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీబీ పనితీరు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్, ఏసీబీ ఐజీ శంఖ బ్రత బాగ్చి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఏసీబీలో అధికారులు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, మరింత అంకిత భావంతో ఇంకా మెరుగ్గా పని చేయాలని చెప్పారు.
ఏసీబీ సిబ్బంది ఎలాంటి అలసత్వం కలిగి ఉండకూడదని సూచించారు. 14400 కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అవినీతిని నిరోధించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందని, ఈ కాల్ సెంటర్ ఏర్పాటు వల్ల మంచి ఫలితాలు కనిపించాలని అన్నారు. ప్రజలు అవినీతి బారిన పడకుండా, లంచాలు చెల్లించే పరిస్థితి ఎక్కడా ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా కూడా అవినీతి కనిపించకూడదని చెప్పారు. మూడు నెలల్లోగా విశేషమైన మార్పు కనిపించాలని కోరారు. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా, సిబ్బంది పెంపునకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మళ్ళీ నెల రోజుల్లో మరోసారి సమీక్ష చేస్తానని, ఆలోగా మార్పు కనిపించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టం చేశారు.
[subscribe]