ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితాల వెలువడ్డాక 10 రోజుల సస్పెన్స్ అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పుష్కర్ సింగ్ ధామికే అవకాశం ఇస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 23, బుధవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణ స్వీకారం చేశారు.
డెహ్రాడూన్ జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ గుర్మీత్ సింగ్ పుష్కర్ సింగ్ ధామి చేత ప్రమాణం చేయించారు. పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఇది రెండోసారి. ఈ కార్యకమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సహా పలు రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ప్రమాణస్వీకారం చేశారు.
ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 47, కాంగ్రెస్ 19, బీఎస్పీ 2, ఇండిపెండెంట్స్ 2 స్థానాల్లో విజయం సాధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి పూర్తి మెజారిటీ లభించింది. కాగా ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మరోసారి పుష్కర్ సింగ్ ధామికే బీజేపీ అవకాశం ఇచ్చింది. మార్చి 21న డెహ్రాడూన్లో కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, మీనాక్షి లేఖీ, ప్రహ్లాద్ జోషి పరిశీలకులుగా పాల్గొన్న బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా తమ శాసనసభాపక్ష నేతగా పుష్కర్ సింగ్ ధామిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ 11వ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి నేడు ప్రమాణస్వీకారం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ