బుద్ధవనం ప్రాజెక్టు, మన్యంకొండ దేవాలయం, ప్రముఖ బుద్ధిజం కేంద్రాలైన నేలకొండపల్లి, ఫణిగిరిల వద్ద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పనుల పురోగతిపై రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ లో నిర్మించిన అతిపెద్ద బౌద్ధ క్షేత్రం బుద్ధవనం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి త్వరలో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని బుద్ధవనం అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర విభజన వల్ల నాగార్జున కొండను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం వల్ల తెలంగాణ నుండి వెళ్లే పర్యాటకులకు ఆంక్షలు, అడ్డంకులు ఆ రాష్ట్ర అధికారులు సృష్టిస్తున్నారన్నారు. నాగార్జున కొండకు సమాంతర బుద్ధిజం చరిత్ర నేపథ్యం కలిగిన చాకలి గట్టు ఐలాండ్ అభివృద్దికి డిపిఆర్ లను రూపోందించి సీఎం కేసీఆర్ ఆమోదం తీసుకొని పర్యాటకంగా, చారిత్రకంగా అభివృద్ధి చేసేందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేసి బుద్ధవనం ప్రాజెక్టుతో పాటుగా చాకలి గట్టును కూడా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రక మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం వద్ద నూతనంగా నిర్మించ తలపెట్టిన అర్కయాలజీ మ్యూజియం ఏర్పాటుకు డిపిఆర్ లు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలైనా నేలకొండపల్లి, ఫణిగిరి బౌద్ధ క్షేత్రాల వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇక సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహా నగరంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా సుమారు 25 నుండి 30 ఎకరాల విస్తీర్ణంలో దేశం గర్వించదగ్గ మ్యూజియం ను నిర్మించేందుకు అవసరమైన డిపిఆర్లను రూపొందించి కేంద్ర పురావస్తు శాఖకు పంపేందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, చరిత్ర కారులు శివనాగి రెడ్డి, బుద్ధవనం ఓఎస్డీ సుభాన్ రెడ్డిలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ