ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రతిభావంతులైన యువతకు శిక్షణ ఇవ్వడానికి ‘గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో తన సొంత క్రీడా అకాడమీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని మొయినాబాద్ సుజాత హైస్కూల్ ప్రాంగణంలో ఈ అకాడమీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అకాడమీ యొక్క కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను కూడా రూపొందించారు. జనవరి 2, గురువారం నాడు బేగంపేట్ గ్రీన్ పార్క్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో గుత్తా జ్వాల అకాడమీ వెబ్ సైట్ ను తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, అకాడమీ కోచ్ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వెబ్ సైట్ ప్రారంభించిన అనంతరం అకాడమీ నిర్వహణ, సదుపాయాల గురించి మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా, హైదరాబాద్ నగర క్రీడాకారులతో పాటుగా రాష్ట్రం నుంచి అనేకమంది ఔత్సాహిక క్రీడాకారులను ఛాంపియన్లుగా మలచాలంటూ ట్విట్టర్ ద్వారా గుత్తాజ్వాలకు శుభాకాంక్షలు తెలిపారు. గుత్తా జ్వాల మాట్లాడుతూ, ఈ అకాడమీని సుమారు రూ.14 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. నగరంలో ఇది కూడా అతి పెద్ద అకాడమీగా నిలుస్తుందని చెప్పారు. కేవలం బ్యాడ్మింటన్కే కాకుండా మిగిలిన అన్ని రకాల స్పోర్ట్స్కు కూడా ఈ అకాడమీ ద్వారా సేవలందిస్తామని అన్నారు. అవకాశం వస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా అకాడమీ నిర్మించే ఆలోచన చేస్తానని తెలిపారు.