జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్రప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉందని గుర్తుచేశారు. రాజధానిని అమరావతి నుంచి తరలించే విషయంపై కాంగ్రెస్, బీజేపీలు తమ వైఖరి తేల్చి చెప్పాలని కోరారు. కేంద్రం రాజధాని అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం రాజధానికోసం భూములిచ్చిన రైతులతో చర్చించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ముందుగా గుంటూరు జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం జనసేన కార్యాలయానికి వచ్చిన అమరావతి ప్రాంత ధర్మవరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ పల్నాటి ఆడపడుచులు పౌరుషం చూపించారని అన్నారు. పోలీసు వ్యవస్థ కూడా చట్టాన్ని సమానంగా వర్తింపజేయాలని, ప్రజల్ని ఇబ్బందికి గురి చేయొద్దని కోరారు. త్వరలో ధర్మవరం గ్రామంలో పర్యటిస్తానని రైతులకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
[subscribe]