గుంటూరు జిల్లాలోని ఖాజా టోల్ప్లాజా వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ తో పాటుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉన్నందున పర్యటనకు అనుమతి లేదని వారికీ నోటీసులు అందజేశారు. పోలీసుల చర్యపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పౌరుడిగా నిరసన తెలిపే హక్కు తనకుందని, తాను ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పారు. అనంతరం వారిని పోలీసులు ఎక్కడకు తరలిస్తున్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. నారా లోకేష్ ఈ రోజు ముందుగా అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీని కవర్ చేస్తూ విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఒంగోలు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన జర్నలిస్టు సందీప్ భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత ఒంగోలులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
మరోవైపు నారా లోకేష్ ట్విట్టర్ లో రాష్ట్రప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. “రాజధాని గ్రామాలు బోర్డర్ ని తలపిస్తున్నాయి. పాకిస్తాన్ బోర్డర్ లో కూడా ఇంత మంది పోలీసులు ఉండరు. అన్యాయంగా, క్రూరంగా పోలీసు బలంతో ఉద్యమాన్ని అణిచివెయ్యాలని సీఎం వైఎస్ జగన్ యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నారు. వైకాపా ప్రభుత్వం ఎంత అణిచివేస్తే ఉద్యమం అంత ఉగ్రరూపం దాలుస్తుంది. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులను రెచ్చగొట్టే చర్యలు వైకాపా ప్రభుత్వం మానుకోవాలని” హితవు పలికారు.
[subscribe]