శుక్రవారం జరిగిన “రైతు సంఘర్షణ” సభలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి “రైతు డిక్లరేషన్” ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఇది కేవలం రైతు డిక్లరరేషన్ కాదని, రైతుల కోసం కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీ అని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రతి రైతు ఈ డిక్లరేషన్ చదవాలని, డిక్లరేషన్ లో ప్రతి మాటకు కాంగ్రెస్ గ్యారంటీ ఇస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖలపై తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
“రాహుల్ గాంధీ గారూ, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్-చైతన్యవంతులైన తెలంగాణ రైతులు నమ్ముతారా? ఇది రాహుల్ సంఘర్షణ సభ-రైతు సంఘర్షణ సభ కాదని తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నారు. ఎయిర్ పోర్టులో దిగి ఇవ్వాల ఏం మాట్లాడాలి, సభ దేని గురించి అని అడిగిన రాహుల్ గాంధీకి తెలంగాణ రైతుల గురించి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. ఎప్పటికీ తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం గురించి నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ మాత్రమే” అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
ముందుగా శుక్రవారం సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ “రైతు సంఘర్షణ” సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ ప్రకటిస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ధరణి పోర్టల్ రద్దు చేసి, సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, నకిలీ విత్తనాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని, రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం చట్ట పరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు స్పందిస్తూ కాంగ్రెస్ డిక్లరేషన్ ను తెలంగాణ రైతులు నమ్మే పరిస్థితులు లేవని, వారి మాటలను ఎవరూ నమ్మరని, రైతులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని పేర్కొంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ