ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో పొత్తుల వ్యవహారం కీలకం కానుందా? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఈ అనుమానం రాక మానదు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అప్పుడే పొత్తుల అంశంపై రోజుకో విధంగా వార్తలు వస్తున్నాయి. నిన్న ఇదే అంశంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నవరంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుకి ఇతర పార్టీలు కలిసి రావాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రాలో చర్చనీయాంశం అవుతున్నాయి. మరోసారి టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ చంద్రబాబు పొత్తుల వ్యాఖ్యలపై స్పందించింది.
ఈ మేరకు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జల వనరుల శాఖ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా అసెంబ్లీలో తన కర్తవ్యాన్ని వదిలేసి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బూటకపు నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు. గత టీడీపీ హయాంలో ఉన్న వాటి కంటే ప్రస్తుతం నిత్యావసర ధరలు తక్కువగా ఉన్నాయని మంత్రి తెలిపారు. సీఎం జగన్ తన హామీ మేరకు నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రజల హృదయాలను గెలుచుకున్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 81% ఫలితాలు సాధించిందని గుర్తు చేశారు. మరోవైపు పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. వైసీపీకి ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తుందని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ