ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద కృషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) రూ.560 కోట్లతో 250 కేఎల్డీ సామర్థ్యంతో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం నిర్వహించారు. క్రిబ్కో రెండు విడతలుగా రూ.560 కోట్ల పెట్టుబడితో బయో-ఇథనాల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. 100 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్లో 400 మందికి ఉపాధి లభించనుంది. మరిన్ని సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు సహా పలు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఎగుమతి ప్రమోషన్ పాలసీ 2022-27 కింద, ఐదేళ్లలో ప్రస్తుత ఎగుమతులను ప్రోత్సహించడానికి మరియు రెట్టింపు చేయడానికి తగిన విధంగా చర్యలు తీసుకోబడ్డాయి.
వచ్చే ఐదేళ్లలో రూ.3.5 లక్షల కోట్ల ఎగుమతులను చేరుకోవడమే లక్ష్యం దిశగా అనేక విధానాలను ఎస్ఐపీబీ ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఆక్వా రంగం నుంచి ఎగుమతులు జరుగుతున్నాయని, ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోని సముద్ర ఎగుమతుల్లో 46 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయని, అందుకే ఈ రంగాన్ని తగిన విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. సింగిల్ డెస్క్ పద్ధతిలో పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విశాఖపట్నంలో డాటా సెంటర్ ఏర్పాటుకు త్వరితగతిన అనుమతి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి సీఎస్ సమీర్ శర్మ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ