ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దశాబ్దాలుగా పోటీ చేస్తున్న కుప్పం నియోజక వర్గంలో సొంత ఇంటి నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం కోసం స్థలం ఇప్పటికే గుర్తించారు. కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం సమీపంలో సుమారు 2 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు సొంత ఇల్లు నిర్మాణం కోసం కొనుగోలు చేసారని స్థానిక పార్టీ నాయకులు తెలియజేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫారాలపై చంద్రబాబు సంతకాలు చేశారని, జూన్ 5న ఇంటి నిర్మాణానికి భూమి పూజ కూడా చేయనున్నారని స్పష్టం చేశారు. కాగా చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ప్రచారం చేయనప్పటికీ, నియోజకవర్గ ప్రజలు మాత్రం చంద్రబాబుపై విశ్వాసాన్ని ఎల్లప్పుడూ చూపిస్తున్నారు.
అయితే చంద్రబాబు నాయుడు స్థానికేతరుడని, నియోజకవర్గంలో ఉండరని ఇటీవలి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఇదే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ది పొందాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కొన్ని విజయాలు సాధించింది. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు స్థానికేతర ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇక్కడ సొంత ఇంటి నిర్మాణంతో పాటు ప్రజలను కలిసేందుకు వీలుగా ఒక కార్యాలయ భవనాన్ని కూడా నిర్మించటానికి పూనుకున్నారు. అలాగే ప్రతి మూడు నెలలకోసారి నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించారు. ఇకపై కుప్పం ఎప్పుడు వచ్చినా ఈ ఇంట్లోనే నివాసం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోనే ఉంటున్నారని, ఆంధ్రప్రదేశ్లో ఆయనకు శాశ్వత నివాసం లేదని ఇన్నాళ్లుగా అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలకు దీని ద్వారా చెక్ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ