ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు జరగనున్న (జూన్ 23, గురువారం) ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామాగ్రితో బుధవారం సాయంత్రానికే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కాగా ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. నియోజకవర్గంలో మొత్తం 279 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, ఇందులో 122 సమస్యాత్మక కేంద్రాలని గుర్తించిన అధికారులు అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. 1300 మందికి పైగా పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. అలాగే మొత్తం 2,13,338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆత్మకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ప్రస్తుతం ఉపఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అధికార వైఎస్సార్సీపీ, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ, బీజేపీ పార్టీల అభ్యర్థులు, నాయకులు ప్రజలతో మమేకమై పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని వైఎస్సార్సీపీ నేతలు, తమ గెలుపు ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేపు పోలింగ్ జరుగుతుండగా, జూన్ 26వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY