తెలుగు సినీ కార్మికులు ఎట్టకేలకు తమ సమ్మెను విరమించారు. ఈ మేరకు కార్మికుల వేతనాలు పెంచడానికి నిర్మాతల మండలి అంగీకరించిందని, శుక్రవారం నుంచి కార్మికులు విధుల్లో చేరుతారని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గురువారం ప్రకటించింది. కార్మికుల వేతన సవరణ డిమాండ్ను ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీ పరిశీలించి వేతనాల పెంపుపై రేపు నిర్ణయం తీసుకుంటుందని ఫెడరేషన్ ప్రకటించింది. అయితే గడచిన రెండు రోజులుగా చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతో ఈరోజు విషయం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్దకు చేరింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఫిల్మ్ నిర్మాతల మండలి ప్రతినిధులు వేర్వేరుగా మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు.
ఈ క్రమంలో 45 శాతం వేతనాలు పెంచాలన్న కార్మికుల డిమాండ్ న్యాయమైనదేనని ఫెడరేషన్ నాయకులు మంత్రికి తెలియజేయగా, కరోనా ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, దీని వలన తమపై భారం పడుతుందని నిర్మాతలు మంత్రికి తెలిపారు. దీనిపై ఆయన ఇరు పక్షాలు కలిసి కూర్చుని ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. ఆయన సలహా మేరకు ఫెడరేషన్ మరియు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చలు జరిపిన తర్వాత ఈ ముందడుగు పడింది. పెంచిన జీతాలు చెల్లించే బాధ్యత ఫెడరేషన్, ఫిలించాంబర్లదేనని, షూటింగ్స్ కు హాజరయ్యే కార్మికులకు పెంచిన జీతాలు చెల్లిస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారు. దీంతో రేపటినుంచి సినీ కార్మికులు యధావిధిగా షూటింగ్స్ కు హాజరవుతారని యూనియన్ నాయకులు ప్రకటించారు. కాగా సుమారు 20,000 మంది కార్మికుల సమ్మె కారణంగా హైదరాబాద్లో కనీసం 20-25 సినిమాల షూటింగ్స్ మరియు ఇతర నిర్మాణ సంబంధిత పనులు నిలిచిపోయినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY