ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో కూడా కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఈ పరిణామాలను జాతీయ విపత్తుగా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం భారత్ లో 125 పాజిటివ్ కరోనా వైరస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 17 మంది విదేశీయులు ఉన్నారు. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందగా, మరో 9 మంది కోలుకున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టాలీవుడ్ యంగ్ హీరోలు, ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ ఒక వీడియో విడుదల చేశారు. కరోనా నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఆరు సూత్రాలను ఈ వీడియోలో వారు వివరించారు.
ఎన్టీఆర్ : చేతులు మోచేతి వరకు సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి. గోళ్ళ సందుల్లో కూడా… బయటికి వెళ్లి వచ్చినపుడు, భోజనానికి ముందు కనీసం రోజుకు 7 నుంచి 8 సార్లు చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి.
రామ్ చరణ్ : కరోనా వైరస్ తగ్గేవరకూ తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్లు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం వంటివి చేయకూడదు.
ఎన్టీఆర్ : మీకు పొడిదగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమిలేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. అలాగే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అరచేతిని కాకుండా మోచేతిని అడ్డు పెట్టుకోవాలి.
రామ్ చరణ్ : జనం ఎక్కువగా ఉండే చోటుకి వెళ్లకండి. మంచినీళ్లు ఎక్కువగా తాగండి. గడగడా తొందరగా త్రాగే కన్నాఎక్కువ సార్లు కొంచెం కొంచెం త్రాగండి. వేడి నీళ్లు త్రాగితే ఇంకా మంచిది.
ఎన్టీఆర్ : వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తను దయచేసి నమ్మేయకండి. వాటిల్లో నిజమేంటో తెలియకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేయకండి. అసత్యాలను ఫార్వర్డ్ చేస్తే అనవసరంగా అవతలి వాళ్లలో ఆందోళన పెరుగుతుంది. ఇది వైరస్కంటే ప్రమాదకరం. www.who.int అనే వెబ్ సైట్ లో ఇచ్చే సూచనలను పాటించండి.
రామ్ చరణ్ : కోవిడ్-19 మీద ప్రభుత్వం ఇచ్చే సలహాలను, సూచనలు పాటిద్దాం. మనల్ని మనమే కాపాడుకుందాం.
ఎన్టీఆర్ : పరిశుభ్రంగా ఉందాం.
రామ్ చరణ్ : సురక్షితంగా ఉందాం.