తెలంగాణలో రాజకీయం మరోసారి వేడిక్కింది. గత కొద్దిరోజుల నుంచి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం ఆయనను బుజ్జగించే బాధ్యతను ఏఐసీసీ దూతలుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డిలకు అప్పజెప్పింది. ఈ క్రమంలో శనివారం ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు పార్టీ వంశీచంద్ రెడ్డిలు వేర్వేరుగా జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. కాగా భేటీలో భాగంగా ఢిల్లీ రావాలంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కోమటిరెడ్డికి కబురు పంపించినట్లు సమాచారం. అయితే దీనిపై కోమటిరెడ్డి సానుకూలంగా స్పందించలేదని, పార్టీ మారడానికే ఆయన నిశ్చయించుకున్నారని తెలుస్తోంది.
భేటీ అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో బై ఎలక్షన్స్ అంటూ వస్తే రాష్ట్ర రాజకీయాలనే మార్చేసే తీర్పు వస్తుందని ఆయన ప్రకటించారు. దీనికి ముందు మునుగోడు ఉపఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలి. సీఎం కేసీఆర్ భావిస్తే ఉపఎన్నిక రాదు, మునుగోడు ప్రజలు భావిస్తే తప్పకుండా ఉపఎన్నిక వస్తుంది. మునుగోడు తీర్పు తెలంగాణలో మార్పునకు నాంది కావాలి. రాష్ట్ర రాజకీయాలనే మార్చేసే తీర్పు అందించటానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి, మునుగోడు ప్రజలకూ మధ్య జరిగే యుద్ధం, కేసీఆర్పై ధర్మ యుద్ధం చేస్తున్నా అని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం నుంచి తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆ తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఆయన ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ