భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందేశాన్ని మరియు జాతీయ జెండాకు ఉన్న భావోద్వేగ సంబంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు బుధవారం పార్లమెంటు సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట నుంచి విజయ్ చౌక్ వరకు ఎంపీల ‘హర్ ఘర్ తిరంగా’ బైక్ ర్యాలీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీలో పలువురు కేంద్రమంత్రులు కూడా పాల్గొన్నారు. భారత పౌరులకు మరియు జాతీయ జెండాకు మధ్య వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని విస్తరించేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ర్యాలీని నిర్వహించింది.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖను అభినందించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు “వలస పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో మన స్వాతంత్య్ర సమరయోధులు చేసిన అసంఖ్యాక త్యాగాలను గుర్తుచేస్తాయని అన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలోని ధైర్యసాహసాలు, సామాజిక సామరస్య కథలను పునరుద్ఘాటించాలని పిలుపునిచ్చారు. “మనం గర్వంగా మన జాతీయ జెండాను ఎగురవేస్తున్నప్పుడు, మన జాతీయ విలువలైన ఏకత్వం, సామరస్యం మరియు సార్వత్రిక సౌభ్రాతృత్వం కూడా ప్రతిబింబిస్తుంది మరియు సమర్థించబడుతుందని” అని వెంకయ్య నాయుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, భారతదేశ మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, భారత యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, విదేశాంగ శాఖ సహాయ మంత్రులు మీనాక్షి లేఖి మరియు వి.మురళీధరన్ మరియు పెద్ద సంఖ్యలో ఎంపీలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY