ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి ముఖ్యమైన రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ నీతి ఆయోగ్ 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పంటలమార్పిడి, నూనె దినుసలు, పప్పు దినుసల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, జాతీయ విద్యావిధానం అమలు, పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక పాలనపై జరిగిన చర్చలో సీఎం జగన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్య, పాలనా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలను తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం అయ్యిందని, 62శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఇక రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35% పై మాటేనని, అందుకే వ్యవసాయరంగం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఆ రంగానికి మేము అత్యంత ప్రధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్, ఉచిత పంటల బీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9 గంటలపాటు ఉచితంగా కరెంటు తదితర పథకాలు, కార్యక్రమాలను రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్నట్లు సీఎం తెలియజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల)ను ఏర్పాటు చేశామని, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాలద్వారా అందిస్తున్నామని, విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ ఆర్బీకేల ద్వారా రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఆర్బీకేల్లో కియోస్క్లను కూడా అందుబాటులో ఉంచామని, రైతులకు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వాటిని కియోస్క్ల ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వారి చెంతకే చేరవేస్తున్నామని ప్రకటించారు. అలాగే పంటల మార్పిడి, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం, క్రమంగా సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులవైపుగా రైతులను ప్రోత్సహిస్తున్నామని కూడా సీఎం జగన్ తెలిపారు.
ఇక విద్యా రంగం విషయానికొస్తే.. తల్లిదండ్రుల పేదరికం అన్నది పిల్లల చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకాకూడదనే ఉద్దేశంతో, స్కూళ్లు మానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతో పాటు జీఈఆర్ నిష్పత్తిని పెంచేందుకు ‘అమ్మ ఒడి’ అనే పథకాన్ని అమలు చేస్తున్నామని, పిల్లలను బడికి పంపిస్తే చాలు, ఏటా రూ.15వేల రూపాయల చొప్పున పిల్లల తల్లులకు అందిస్తున్నామని సీఎం తెలియజేశారు. 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను కూడా పరిగణలోకి తీసుకున్నామని, పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తీసుకు వచ్చామని ప్రకటించారు. అంతేకాకుండా ‘విద్యా కానుక’ ద్వారా స్కూలు బ్యాగులు, బై లింగువల్ టెక్ట్స్బుక్స్, నోట్ పుస్తకాలు, షూ, 3 జతల యూనిఫారం, ఇంగ్లిషు టు తెలుగు డిక్షనరీలు ఇస్తున్నామని, పిల్లలకు మరింత నాణ్యతతో బోధన అందించడానికి నాణ్యమైన పాఠ్యాంశాలతో ఉన్న బైజూస్ యాప్ కూడా అందిస్తున్నామని, అలాగే 8 వ తరగతి విదార్థులకు ట్యాబ్లు కూడా ఇవ్వబోతున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
ఇక పాలనాపరంగా కూడా వినూత్నంగా ముందుకెళ్తున్నామని, దీనిలో భాగంగా పౌరుల గడపవద్దకే సేవలందించే విధానాన్ని అమలు చేస్తూ.. చివరి వరకూ అత్యంత పారదర్శకంగా సేవలను అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. దీనికోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ‘గ్రామ, వార్డు సచివాలయ’ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రతి 50–100 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించామని, దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాకుండా అవినీతి లేకుండా, పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ఇక సమర్థవంతంగా లక్ష్యాలు సాధించడానికి అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టామని, వివక్షకు, అవినీతికి తావులేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం జగన్ వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY