దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజుల పాటుగా ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ ఉత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (ఆగస్టు 8, సోమవారం) హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ముందుగా హెచ్ఐసీసీ ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్, జాతిపిత మహాత్మ గాంధీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, అన్నిజిల్లాల రైతుబంధు సమితి అధ్యక్షులు, జెడ్పిటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, అన్ని శాఖల హెచ్ఓడీలు, జిల్లా కేంద్రాల్లో ఉండే అందరు ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ తదితర రక్షణ రంగానికి చెందిన కమాండర్స్, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్యాధికారులు పాల్గొన్నారు. హెచ్ఐసీసీకి చేరుకునే అన్ని దారులను జాతీయ జెండాలతో అలంకరించారు. అలాగే ఉత్సవాల ప్రారంభ నేపథ్యంలో నగరంలోని అన్ని జంక్షన్లను, ప్రభుత్వ కార్యాలయాలను విధ్యుత్ దీపాలతో అలంకరించి పండగ శోభ కలిగే విధంగా తీర్చిదిద్దారు.
ఇక స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సాంస్కతిక కార్యక్రమాలు, 75 మంది వీణా కళాకారులచే వీణా వాయిద్య ప్రదర్శన, సాండ్ ఆర్ట్ ప్రదర్శన, దేశ భక్తి ప్రబోధ నృత్య కార్యక్రమం, ఫుజన్ ప్రదర్శన, లేజర్ షోలను అందరితో కలిసి సీఎం కేసీఆర్ వీక్షించారు. ముందుగా సీఎస్ సోమేశ్ కుమార్ స్వాగత ప్రసంగం, వజ్రోత్సవాల కమిటీ ఛైర్మెన్, రాజ్యసభ ఎంపీ డా.కేశవరావు ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై సందేశాన్ని ఇచ్చారు. మరోవైపు నేటి నుంచి 22 వరకు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. రాష్ట్రంలోని ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడంలో భాగంగా రేపటి నుంచి ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభం కానుంది. ఆగస్టు 22న ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు జరగనున్నాయి
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY